Amrulla Saleh: పంజ్ షీర్ లోయకు తరలిపోయిన 10 వేల మంది ఆఫ్ఘన్లు.... ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన అమృల్లా సలేహ్

  • ఆఫ్ఘన్ లో తాలిబన్ల దురాక్రమణ
  • ఇటీవలే కాబూల్ స్వాధీనం
  • పంజ్ షీర్ లో తలదాచుకుంటున్న ఇతర ప్రాంతాల పౌరులు
  • ఆకలితో బాధపడుతున్నారన్న సలేహ్
 Amrullah Saleh wrote UNO

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల దురాక్రమణ అనంతరం దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వీడడం తెలిసిందే. ఘనీ స్థానంలో ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. తాలిబన్లు రాజధాని కాబూల్ ను కూడా ఆక్రమించడంతో సలేహ్ పంజ్ షీర్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సలేహ్ తాజాగా ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.

తాలిబన్లు కాబూల్ లో కాలుమోపాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన 10 వేల మంది పంజ్ షీర్ లోయకు తరలి వచ్చారని, వారంతా ఇప్పుడు మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో తలదాచుకుంటున్నారని వెల్లడించారు. వారందరికీ ఆహారం అందించడం కష్టసాధ్యంగా ఉందని, ఆకలి, పోషకాహార లోపంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అమృల్లా సలేహ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇప్పటికిప్పుడు సాయం చేయాల్సి అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు.

అటు, పంజ్ షీర్ లో తాలిబన్ల దురాగతాలను అడ్డుకోవాలని, దీనిపై వెంటనే స్పందించాలని ఐక్యరాజ్యసమితిని, ప్రపంచ దేశాలను కోరారు.

More Telugu News