Ashok Babu: రాష్ట్రంలో పరిణామాలపై ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • ఐఏఎస్ అధికారుల తీరుపై అశోక్ బాబు విమర్శలు
  • రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని వ్యాఖ్య  
  • చట్టవిరుద్ధ నిర్ణయాలను వ్యతిరేకించాలని సలహా  
  • కిందిస్థాయి ఉద్యోగులపై వేధింపులు ఆపాలని సూచన 
MLC Ashok Babu comments on IAS Officers

ఏపీలో ఇటీవల పరిణామాలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే చట్టవిరుద్ధ నిర్ణయాలను ఐఏఎస్ అధికారులు వ్యతిరేకించాలని సూచించారు. కిందిస్థాయి ఉద్యోగులపై అధికారులు చేస్తున్న వేధింపులు ఆపాలని అన్నారు. పరిపాలనలో ఐఏఎస్ అధికారుల పాత్ర నానాటికీ దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు.

"ఐఏఎస్ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ చట్టాన్ని అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత ఐఏఎస్ లదే. ప్రభుత్వ చట్ట విరుద్ధ నిర్ణయాలను ఐఏఎస్ అధికారులు ధైర్యంగా వ్యతిరేకించాలి. ఏది సబబో ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఈ రెండు అంశాలు లోపించిన కారణంగానే ఐఏఎస్ లు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఈ కారణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, కోర్టులతో అక్షింతలు వేయించుకోవడం జరుగుతోంది. రేపు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రికో, ఆ శాఖ మంత్రికో కోర్టు శిక్ష వేయదు... అధికారికే శిక్ష పడుతుంది. ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగ ధర్మం ఏమిటో తెలుసుకోవాలి.

ఇక రాష్ట్రంలో కిందిస్థాయి ఉద్యోగులపై వేధింపుల పర్వం గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలోనూ జరుగుతోంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఏరా, యూజ్ లెస్ ఫెలో అనే పదాలు వాడారు. ఆ కలెక్టర్ ను నేను ఒక్కటే అడుగుతున్నా... మీరు ఐఏఎస్ కు సెలక్టయింది వాస్తవమే, మరి మీరు ఐఏఎస్ గా ఆలిండియా లెవల్లో టాపర్ గా ఎందుకు రాలేకపోయారు? మరి మీరు ఐఏఎస్ గా నెంబర్ వన్ గా రానందుకు మేము మిమ్మల్ని యూజ్ లెస్ ఫెలో అని అంటే ఎలా ఉంటుంది?

మీ కింద పనిచేసే ఎమ్మార్వోలు కూడా సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి సెలెక్ట్ అయిన వ్యక్తులేనని గుర్తించాలి. వాళ్లను పట్టుకుని ఏరా, యూజ్ లెస్ ఫెలో అనడం సరికాదు. వ్యాక్సిన్లు ఆరోగ్యశాఖ బాధ్యత. దాన్ని రెవెన్యూ సిబ్బందికి అప్పగిస్తారా? రెవెన్యూ సిబ్బందికి కంటే మెడికల్ సిబ్బందే ఎక్కువమంది ఉన్నారు. వ్యాక్సిన్ బాధ్యత వారికే అప్పగించాలి గానీ, దానికి ఎమ్మార్వోను బాధ్యుడ్ని చేసి దూషించడాన్ని ఖండిస్తున్నాం. జూనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఈ రకమైన అహంభావ పరిస్థితులు నెలకొంటే, సీనియర్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పరిస్థితి ఏర్పడింది" అని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.

More Telugu News