EngvsInd: నాలుగో టెస్టులో అశ్విన్‌కు దక్కని చోటు.. మండిపడుతున్న మాజీలు

  • మూడో టెస్టు ఓటమి తర్వాత కచ్చితంగా అశ్విన్ ఉంటాడంటూ వదంతులు
  • కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కూడా 6 వికెట్లు తీసిన ఆఫ్‌ స్పిన్నర్
  • ఇది పిచ్చితనమన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ashwin exclusion from playing eleven garner crtisism

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నాలుగో టెస్టులో భారత జట్టు కూర్పుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌లో స్పిన్‌కు బాగా సహకరించే ఓవల్ పిచ్‌పై అశ్విన్‌ను ఆడించకపోవడం ఏంటని వాళ్లు అడుగుతున్నారు. దీనికితోడు ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇక్కడ జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన అశ్విన్.. ఒక మ్యాచ్‌లో ఏకంగా 6 వికెట్లు కూల్చి సత్తా చాటాడు.

అయినా సరే అతన్ని పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. మూడో టెస్టులో ఘోరపరాజయం తర్వాత టీమిండియాలో మార్పులుంటాయని అంతా భావించారు. అనుకున్నట్లే జట్టులో రెండు మార్పులు చేశారు. ఇషాంత్ శర్మ, మహమద్ షమీని తొలగించి వారి స్థానంలో ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. ఇలా అశ్విన్‌ను పక్కన పెట్టడంపై ఇంగ్లండ్ మాజీ సారధి మైకేల్ వాన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశాడు. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్టుల్లో ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను ఎంచుకోకపోవడాన్ని నమ్మలేక పోతున్నట్లు వాన్ మాట్లాడాడు.

‘‘413 వికెట్లు, 5 టెస్టు సెంచరీలు ఉన్న వ్యక్తిని పక్కన కూర్చోబెడతారా? ఇది పిచ్చితనం’’ అంటూ అతను ట్వీట్ చేశాడు. అలాగే క్రికెటర్లు లీసా స్థలేకర్, టామ్ మూడీ కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కామెంటేటర్లు హర్షభోగ్లే, అలన్ వికిన్స్ కూడా తమకు ఈ నిర్ణయం అంతుచిక్కడం లేదన్నారు.

More Telugu News