Helicopter: రూ. 30 కోట్ల హెలికాప్టర్ ను రూ. 4 కోట్లకు అమ్ముతున్న రాజస్థాన్ ప్రభుత్వం!

  • వసుంధరా రాజే సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ కొనుగోలు
  • అశోక్ గెహ్లాట్ సీఎం అయిన తర్వాత తలెత్తిన సాంకేతిక సమస్య
  • అప్పటి నుంచి గోడౌన్ కే పరిమితమైన హెలికాప్టర్
Rajstan govt selling RS 30 Cr helicopter for Rs 4 Cr

అత్యంత ఖరీదైన, అన్ని భద్రతా సదుపాయాలున్న హెలికాప్టర్ ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ. 30 కోట్లతో కొనుగోలు చేశారు. ఆమె సీఎంగా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలకు ఈ హెలికాప్టర్ ను వినియోగించారు.

అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేశారు. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్ ను ఎవరూ వినియోగించలేదు. దీంతో అప్పటి నుంచి అది గోడౌన్ లో వృథాగా పడి ఉంది. ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్ ను అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పటి వరకు 12 సార్లు టెండర్లను పిలిచినా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఏకంగా రూ. 26 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ... కేవలం రూ. 4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈసారైనా ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

More Telugu News