Karanam Rahul: కరణం రాహుల్ హత్య కేసులో ఆసక్తికర వివరాల వెల్లడి!

  • రాహుల్ కు ఫోన్ చేసిన గాయత్రి
  • రూ.6 కోట్ల వివాదంపై మాట్లాడుకుందామని కాల్
  • రాహుల్ వస్తున్న సమాచారం కోరాడకు చేరవేసిన గాయత్రి
  • కారులోనే రాహుల్ హత్య
Interesting facts about Karanam Rahul murder case

విజయవాడలో యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో మరికొన్ని అంశాలు వెలుగుచూశాయి. ఈ కేసులో గాయత్రి అనే మహిళ పేరు కూడా మొదట్లో వినిపించింది. ఆ గాయత్రి పాత్ర ఏంటన్నది ఇప్పుడు వెల్లడైంది. రూ.6 కోట్ల ప్రాపర్టీకి చెందిన ఓ వివాదంలో మాట్లాడుకుందాం రమ్మంటూ రాహుల్ కు ఫోన్ చేసింది గాయత్రినే అని తెలిసింది.

రాహుల్ వస్తున్న సమాచారాన్ని గాయత్రి ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ కు అందించింది. గాయత్రి ఫోన్ కాల్ తో తాము ఎప్పుడూ కలుసుకునే డీవీ మ్యానర్ కు రాహుల్ వచ్చాడు. రాహుల్ ను అక్కడ్నించి దుర్గా కళామందిర్ థియేటర్ కు తీసుకెళ్లిన నిందితులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ కేసులో నిందితులైన కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం బలవంతంగా ఫ్యాక్టరీ ప్రాపర్టీని రాయించుకున్నట్టు తెలిసింది.

ఆపై కోరాడ అనుచరులు రాహుల్ ను కారులో దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. రాహుల్ మృతదేహాన్ని కారులోనే ఉంచి లాక్ చేసేశారు. ఈ హత్య కేసులో కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజి కీలకంగా మారింది. ఈ కేసులో విచారణలో భాగంగా రేపు కోరాడ విజయ్ కుమార్, బాబూరావు, సీతయ్యలను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

More Telugu News