Jeevan Reddy: బీజేపీ... బిగ్ జోకర్స్ పార్టీగా మారింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

  • ఎంపీ అరవింద్ ఫేక్ అంటూ వ్యాఖ్యలు
  • ఫేక్ బాండ్ రాసిచ్చారని విమర్శలు
  • మోదీతో మాట్లాడి పసుపు బోర్డు తెప్పించాలని సవాల్
  • బీజేపీ పాదయాత్రలు ప్రజలు నమ్మరని వెల్లడి
TRS MLA Jeevan Reddy slams BJP and MP Arvind

టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ... బిగ్ జోకర్స్ పార్టీగా మారిందని అభివర్ణించారు. పసుపు బోర్డు తెస్తానంటూ ఫేక్ ఎంపీ అరవింద్ ఫేక్ బాండ్ రాసిచ్చారని విమర్శించారు. అవినీతి గురించి అరవింద్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 28 మంది అవినీతిపరులను దేశం దాటించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అరవింద్ కు దమ్ముంటే మోదీతో మాట్లాడి పసుపు బోర్డు తెప్పించాలని సవాల్ విసిరారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల గురించి మాట్లాడే స్థాయి అరవింద్ కు లేదని స్పష్టం చేశారు. అరవింద్ ఇంట్లో మూడు పార్టీలు ఉన్నాయని, అరవింద్ మొదట ఇంట గెలవాలని హితవు పలికారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నియంత, కుటుంబ పాలన అనడం తప్ప కాంగ్రెస్, బీజేపీలకు ఏదీ చేతకాదని అన్నారు. బీజేపీ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.

More Telugu News