UNICEF: వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదంలో భారతీయ చిన్నారులు: యూనిసెఫ్ హెచ్చరిక

  • దక్షిణాసియాలోని నాలుగు దేశాల్లోని చిన్నారులకు అధిక ప్రమాదం
  • జాబితాలో భారత్‌తోపాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా
  • వాతావరణ మార్పుల కారణంగా 33 దేశాల్లోని 100 కోట్ల మంది చిన్నారులు ప్రమాదంలో
Indian children at risk UNICEF warning

వాతావరణ మార్పుల కారణంగా దక్షిణాసియాలోని నాలుగు దేశాల్లో గల చిన్నారులు అత్యధిక ప్రమాదం ఎదుర్కొంటున్నారని యూనైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) తాజా నివేదికలో వెల్లడైంది. ఈ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉండటంతో కలకలం రేగుతోంది.

భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల చిన్నారులు వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్నారు. పర్యావరణ మార్పులు-చిన్నారుల హక్కుల సంక్షోభం పేరిట యూనిసెఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. వాతావరణ మార్పుల ప్రమాద తీవ్రతను అనుసరించి యూనిసెఫ్.. చిన్నారుల కోసం దేశాల వారీగా క్లయిమేట్ రిస్క్ సూచీని  విడుదల చేసింది.
 
ఈ సూచీ ప్రకారం.. మొత్తం 33 దేశాల్లోని 100 కోట్ల మంది చిన్నారులు వాతావరణ మార్పుల కారణంగా అత్యధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.  ఈ జాబితాలో భారత్‌ 26వ స్థానంలో ఉండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు వరుసగా 14, 15, 25వ స్థానాల్లో ఉన్నాయి. వాయుకాలుష్యం, పలుమార్లు అకస్మాత్తుగా సంభవించే వరదల కారణంగా భారతీయ మహిళలు, చిన్నారులు పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఈ సూచీ తెలిపింది.

‘‘వాతావరణ మార్పులు బాలల హక్కుల సంక్షోభానికి దారితీస్తున్నాయి. నానాటికీ తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల కారణంగా చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు ఈ సూచీ ద్వారా వెల్లడయ్యాయి. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్య వంటి అత్యవసర వసతులు ఇప్పటికే చిన్నారులకు అరకొరగా అందుబాటులో ఉన్నాయి. వాతావరణ మార్పులు తీవ్రమైతే చిన్నారులు మరింత ప్రమాదంలో పడతారు’’ అని యూనిసెఫ్ భారత ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలీ హాకే పేర్కొన్నారు.

More Telugu News