కాబూల్ దృశ్యాలు మనసును కలచివేశాయి.. ఆఫ్ఘన్ల భద్రత కోసం ప్రార్థిస్తున్నా: సత్యదేవ్
- ‘హబీబ్’ చిత్రం కోసం ఆఫ్ఘనిస్థాన్ వెళ్లిన తెలుగు నటుడు
- ‘ఖుదాగవా’ తర్వాత ఆఫ్ఘన్లో షూట్ చేసిన చిత్రమిదే
- తెలుగులో నాగార్జున తర్వాత ఆఫ్ఘన్ వెళ్లిన రెండో యాక్టర్ సత్యదేవ్
తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో వెలుగు చూసిన పరిణామాలపై సత్యదేవ్ స్పందించారు. ఆఫ్ఘన్ పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందన్న ఈ నటుడు.. ముఖ్యంగా కాబూల్ ఎయిర్పోర్టులో దృశ్యాలు మనసును కలచివేశాయని చెప్పారు. కొన్నిరోజుల క్రితం అదే ఎయిర్పోర్టులో తాము ల్యాండయ్యామని, అక్కడ ఇలా జరగడం బాధగా ఉందని ఆయన అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్లో షూటింగ్ సమయంలో ఉగ్రవాదుల నుంచి ప్రతిరోజూ బెదిరింపులు వచ్చేవని చెప్పిన ఆయన.. స్థానిక ప్రజలు మాత్రం తమని చాలా ఆప్యాయంగా పలకరించేవారని గుర్తుచేసుకున్నారు. తమను తీసుకెళ్లి వాళ్ల వంటలు చేసి తినిపించారని చెప్పారు. తన ఆఫ్ఘన్ పర్యటనను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. అలాంటి వారికి ఇంతటి కష్టం రావడం తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. ఆఫ్ఘన్ల భద్రత కోసం ప్రార్థిస్తున్నానని, త్వరలోనే వారి సమస్యలకు పరిష్కారం లభించి, అక్కడ శాంతి స్థాపన జరగాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.