Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను పాకిస్థాన్ ఆక్రమించలేదు.. తాలిబన్లు ఆఫ్ఘన్ ను పాలించలేరు: దేశ మాజీ ఉపాధ్యక్షుడు

  • తనను తాను కేర్ టేకర్ ప్రెసిడెంట్‌గా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలేహ్
  • దేశాలు చట్టాలను గౌరవించాలి, హింసను కాదు
  • ఉగ్రమూకలకు తలవంచి చరిత్రలో నిలవద్దంటూ ప్రజలకు పిలుపు
  • తాలిబన్లకు తలవంచబోనని ప్రకటన
  • ప్రస్తుతం పాంజ్‌షిర్‌లో ఉన్న నేత

Pakistan does not occupy Afghanistan Taliban cannot rule Former Vice President

ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు, తనను తాను దేశపు కేర్ టేకర్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నేత అమ్రుల్లా సాలేహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను నమ్మే లక్షల మందిని నిరుత్సాహపరచను. తాలిబన్లకు ఎప్పటికీ తల వంచను’’ అని అమ్రుల్లా ప్రకటించారు. ప్రజలెవరూ కూడా ఉగ్రమూకలకు తలవంచి చరిత్రలో నిలవద్దని పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే దేశాలు చట్టాలను గౌరవించాలని, హింసను కాదని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చాలా పెద్దదని.. దాన్ని పాకిస్థాన్ ఆక్రమించడం లేదనీ, అలాగే తాలిబన్లు దేశాన్ని పాలించడం అసాధ్యమని ఆయన చెప్పారు. చరిత్రలో ఉగ్రవాదులకు తలవంచిన అవమానాన్ని లిఖించుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఇంకా తాలిబన్ల వశం కాని పాంజ్‌షిర్‌ లోయ ప్రాంతంలో ఆయన ప్రస్తుతం తలదాచుకున్నారు. ఆయన ఇక్కడే పుట్టి పెరిగి, శిక్షణ పొందారట. గతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన అహ్మద్ షా మసూద్‌ కుమారుడితో కలిసి ఆయన మిలటరీ దళాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించాలనే యోచనలో అమ్రుల్లా, మసూద్ కుమారుడు ఉన్నట్లు సమాచారం. తాలిబన్ సేనల నుంచి తప్పించుకున్న ఆఫ్ఘన్ మిలటరీ దళాలు ఇప్పుడు పాంజ్‌షిర్ చేరుతున్నట్లు తెలుస్తోంది.

More Telugu News