Bandi Sanjay: ఈ నెల 24 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర... కార్యకర్తలకు దిశానిర్దేశం

  • పాదయాత్ర చేపడుతున్న బండి సంజయ్
  • భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభం
  • కార్యకర్తలకు వర్క్ షాప్ నిర్వహణ
  • పాదయాత్రపై అవగాహన
Bandi Sanjya Padayatra from Bhagyalakshmi temple

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ తీవ్రపోరాటం సాగిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ లో సమరోత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా దూకుడు పెంచాలని నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ పాదయాత్రను హైదరాబాదు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభిస్తున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు.

ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు వర్క్ షాప్ నిర్వహించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ అవినీతి, నియంత పాలనను ఎండగట్టడంతో పాటు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి హామీల అమలులో కేసీఆర్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు వివరించినట్టు తెలిపారు. అంతేకాకుండా, తనతో కలిసి ప్రజా సంగ్రామ పాదయాత్రలో పాల్గొనే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్టు వెల్లడించారు.

More Telugu News