Afghanistan: తాలిబన్ల నుంచి తమ పిల్లలను కాపాడండంటూ.. ఇనుప ముళ్ల కంచెపై నుంచి ఎయిర్ పోర్టులోకి విసిరేస్తున్న తల్లులు.. కన్నీరు పెడుతున్న నాటో సైనికులు!

  • కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఆవేదనా భరిత దృశ్యాలు
  • కంచెల్లోనే చిక్కుకున్న కొందరు చిన్నారులు
  • మంచి భవిష్యత్ కోసం ఆరాటం
Afghan Women Throw Their Babies From Barbed Wires To Save Them From Talibans

తాలిబన్ల ఆగడాలకు ఒక తరం ఎంతో నష్టపోయింది. మళ్లీ గాడిన పడుతున్నాం అనుకునేలోగానే.. ఆపద కమ్మేసింది. తర్వాతి తరమైనా బాగుపడాలన్న ఉద్దేశంతో ఆఫ్ఘనిస్థాన్ మహిళలు తమ పిల్లలను.. కాబూల్ విమానాశ్రయం చుట్టూ పెట్టిన కంచెల పైనుంచి విమానాశ్రయంలోకి విసిరేస్తున్నారు. తమ పిల్లలను కాపాడి తీసుకెళ్లండంటూ అమెరికా, బ్రిటన్ దేశాల సైన్యానికి మొరపెట్టుకుంటున్నారు. వాళ్లొచ్చేస్తున్నారు.. కాపాడండంటూ వారు పెట్టిన ఆర్తనాదాలు సైన్యానికే కన్నీరు తెప్పిస్తున్నాయి.

మహిళలు తమ పిల్లలను కంచె మీది నుంచి విసిరేసి తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చూసి తమ సైనికులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని బ్రిటన్ సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. కొందరు పిల్లలు ఆ ఇనుప ముళ్ల కంచెల్లోనే చిక్కుకుపోయి నరకం అనుభవించారన్నారు.

పిల్లలను తీసుకొని కాబూల్ విమానాశ్రయం గేట్ దగ్గర వారి తల్లులు వేచి చూడడం అందరినీ కలిచివేసింది. వారిని బెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. అయితే, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. తాలిబన్ల కాల్పుల్లో ఆస్ట్రేలియా సైన్యానికి చెందిన ఓ మాజీ ఇంటర్ ప్రిటర్ కాలికి గాయమైంది. ఆస్ట్రేలియా సైన్యం తరలింపుల సందర్భంగా కాబూల్ విమానాశ్రయం గేట్ దగ్గర నిలబడగా కాల్చారంటూ ఆ వ్యక్తి చెప్పాడు.

More Telugu News