Warangal Dist: రణరంగంగా మారిన వరంగల్ జిల్లా నర్సంపేట.. గుడిసెలు ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత

  • ఎంసీపీఐయూ  పిలుపుతో  భారీగా తరలివచ్చిన పేదలు
  • జెండా ఎగరేసి గుడిసెలు వేసుకున్న వైనం
  • గుడిసెలు తొలగించి సామగ్రిని కాల్చేసిన పోలీసులు
  • ఆరుగురి అరెస్ట్
Tensions erupt Narsampet

ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను ఖాళీ చేయించడంతో వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ శివారులోని సర్వే నంబరు 62లో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకునేందుకు ఎంసీపీఐయూ నేతృత్వంలో డివిజన్‌లోని అన్ని గ్రామాల నుంచి శనివారం పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రంతా అక్కడే ఉన్న వారు నిన్న ఉదయం జాతీయ జెండా ఎగరవేసి  గుడిసెలు వేశారు.  

సమాచారం అందుకున్న ఆర్డీవో పవన్‌కుమార్, ఏసీపీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ సతీశ్ బాబు, తహసీల్దార్ రామ్మూర్తి ఆధ్వర్యంలో వరంగల్ నుంచి వచ్చిన పోలీసు, రెవెన్యూ సిబ్బంది గుడిసెలను తొలగించి సామగ్రికి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పేదల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం జరిగిన తోపులాటలో పలువురు స్పృహతప్పి కిందపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అందరినీ పంపించివేశారు.

More Telugu News