Somesh Kumar: అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుంది: సీఎస్ సోమేశ్ కుమార్

  • తెలంగాణలో దళిత బంధు
  • హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు
  • ఈ నెల 16న ప్రారంభం
  • లబ్దిదారులకు చెక్కులు ఇవ్వనున్న సీఎం కేసీఆర్
 Telangana CS Somesh Kumar expalins Dalitha Bandhu project

సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండడం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి లబ్దిదారుల జాబితా రూపొందించారు. అయితే తమకు దళిత బంధు ఎందుకివ్వరంటూ దళితులు నేడు హుజూరాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ స్పందించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. దళిత బంధు అద్భుతమైన పథకం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కొందరు లబ్దిదారులకు స్వయంగా చెక్కులు అందిస్తారని సీఎస్ వివరించారు.

దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హుజూరాబాద్ లోనే ఉన్నారు.

More Telugu News