Vijayabhaskar Reddy: రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ రెడ్డి హత్యకేసును ఛేదించిన పోలీసులు

  • గత 20 నుంచి విజయభాస్కర్ రెడ్డి అదృశ్యం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అల్లుడు
  • సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించిన పోలీసులు
  • కారు నెంబరు ఆధారంగా నిందితుల అరెస్ట్
Police reveals real estate businessman Vijayabhaskar Reddy murder case

గత నెల 20వ తేదీ నుంచి కనిపించకుండాపోయిన విజయభాస్కర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురైనట్టు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

నెల్లూరుకు చెందిన విజయభాస్కర్ రెడ్డి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. ఆయన కేపీహెచ్ బీ అడ్డగుట్టలో ఉన్న ఓ హాస్టల్ లో ఉండేవారు. అయితే, జులై 20 నుంచి ఆయన ఫోన్ స్విచాఫ్ అని వస్తుండడంతో, ఆయన అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. కారు నెంబరు ఆధారంగా మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజుతో పాటు మరో వ్యక్తిని నిందితులుగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

హాస్టల్ లో ఉంటున్న విజయభాస్కర్ రెడ్డికి ఆహారంలో మత్తు మందు కలిపి, ఆపై ఆయనను అపహరించి వాహనంలో చంపేసినట్టు నిందితులు వెల్లడించారు. శ్రీశైలంలోని సున్నిపెంటకు తీసుకెళ్లి అక్కడి శ్మశానవాటికలో దహనం చేసినట్టు అంగీకరించారు. కాగా, నిందితులపై అనుమానంతో కాటికాపరి చితిపై ఉన్న విజయభాస్కర్ రెడ్డి శవాన్ని ఫొటో తీసి భద్రపరిచాడు. ఇది కూడా పోలీసుల దర్యాప్తుకు సాయపడింది. ఆర్థికపరమైన అంశాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.

More Telugu News