Allu Arjun: 'శాకుంతలం' సెట్లో అల్లు అర్జున్!

  • షూటింగు దశలో 'శాకుంతలం'
  • భరతుడి పాత్రలో అల్లు అర్హ 
  • సెట్లో అల్లు అర్జున్ సందడి 
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన దేవ్ మోహన్  
Allu Arjun visited Shakunthalam shooting spot

గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' రూపొందుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు, తిరిగి ఇటీవలే మొదలైంది. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. శకుంతల .. దుష్యంతులకు జన్మించినవాడే 'భరతుడు'. ఆ భరతుడి పాత్రను అల్లు అర్జున్ కూతురు 'అర్హ' పోషిస్తోంది.

కొన్ని రోజులుగా శకుంతల .. దుష్యంత .. భరత పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగు జరుగుతున్న లొకేషన్ కి వచ్చాడు. అక్కడ చిత్రీకరణ జరుగుతున్న సన్నివేశాలను గురించి అడిగి తెలుసుకున్నాడు. దేవ్ మోహన్ ను కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడాడు.

అల్లు అర్జున్ ను కలుసుకోవడం పట్ల దేవ్ మోహన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కీలమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 'క్రిస్మస్'కి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

More Telugu News