Kadapa District: హోటల్ పెట్టిన చైన్ స్నాచర్.. ప్రారంభానికి ఎమ్మెల్యే రాక.. చివర్లో సినిమా స్టయిల్ లో ట్విస్ట్!

  • గొలుసు దొంగతనాల్లో ఆరితేరిన ఘనులు
  • ఏపీ, తెలంగాణలో 32 చోట్ల చైన్ స్నాచింగ్
  • చోరీ సొమ్ముతో హోటల్ తెరిచిన నిందితుడు 
  • ప్రారంభం రోజునే అరెస్ట్
Hyderabad police arrest chain snatchers

గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ సంపాదించిన డబ్బుతో హోటల్ పెట్టిన ఓ దొంగ.. దాని ప్రారంభానికి ఏకంగా ఎమ్మెల్యేను ఆహ్వానించాడు. అనుకున్నట్టే ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వచ్చినా, హోటల్ యజమాని రాకపోవడంతో ఎమ్మెల్యే ఆరా తీశారు. విషయం తెలిసి కంగుతిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ముందుగా బైక్‌లను దొంగతనం చేసి, వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడడం సయ్యద్ బాషా, షేక్ అయూబ్‌లకు వెన్నతో పెట్టిన విద్య. అలా ఏపీలో 32 చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నారు. తర్వాత వీరు హైదరాబాదుకు మకాం మార్చి, నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో నాలుగు గొలుసు చోరీలకు పాల్పడ్డారు. అదే సమయంలో బైక్‌ ఒకటి పోయిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.

పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. సయ్యద్ బాషా గంటల కొద్దీ జిమ్‌లో గడిపేవాడు. కొందరిని అనుచరులుగా చేసుకుని చిన్నచిన్న సెటిల్‌మెంట్లు చేసేవాడు. ఆ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విలాసవంతంగా గడిపేవాడు. ఆరు నెలల్లోనే ఏడుసార్లు గోవాకు వెళ్లాడు. క్యాసినోలో జూదం ఆడుతూ ఒక్క రోజులోనే రూ. 3 లక్షలు పోగొట్టుకున్నాడు.

నిందితులు ఇద్దరినీ పట్టుకున్న రాచకొండ పోలీసులు.. వీరికి సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి 226 గ్రాముల బంగారం, రూ. 1.7 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్ బాషా (33), షేక్ అయూబ్ (35) ఇద్దరూ కడపకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, రాచకొండ పరిధిలో 36 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. కడపకే చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్ మహ్మద్ ఖలీద్ (35), పఠాన్ జాఫర్‌ఖాన్ (38), నాగొల్లు శశిధర్‌రెడ్డి (28) వీరికి సహకరిస్తున్నట్టు గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కడపలో అదుపులోకి తీసుకున్న నిందితులను హైదరాబాద్‌కు తరలించారు. కాగా, చోరీ చేసిన సొమ్ముతో హోటల్ పెట్టిన ప్రధాన నిందితుడు చివరికి దాని ప్రారంభోత్సవానికి రాకపోయే సరికి ఆరా తీసిన ఎమ్మెల్యే.. అతను గొలుసు దొంగని తెలిసి కంగుతిన్నారు.

More Telugu News