Chaitanya Jonnalagadda: నాగబాబు అల్లుడు చైతన్యకు, అపార్ట్ మెంట్ వాసులకు మధ్య కుదిరిన రాజీ

  • షేక్ పేటలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్న చైతన్య
  • ఆఫీసు కోసం తీసుకున్నామన్న చైతన్య
  • జనం గుంపులుగా వస్తున్నారన్న అపార్ట్ మెంట్ వాసులు
  • పరస్పరం ఫిర్యాదులు
Compromise between Chaitanya and apartment association

టాలీవుడ్ నటుడు నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన వివాదం సమసిపోయింది. చైతన్య, నిహారిక దంపతులు ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని, దాన్ని ఆఫీసు ప్రయోజనాల కోసం వాడుకోవడంపై అపార్ట్ మెంట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చైతన్య ఫ్లాట్ కు రాత్రి పగలు తేడా లేకుండా గుంపులు, గుంపులుగా జనం వస్తుంటారని, కరోనా వ్యాప్తి సమయంలో తమకు ఆందోళన కలుగుతోందని అపార్ట్ మెంట్ వాసులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.

అయితే, దీనిపై ఇరువర్గాలు వివరణ ఇచ్చాయి. రాజీ కుదిరిందని, సమస్య పరిష్కారం అయిందని వెల్లడించాయి. దీనిపై చైతన్య మాట్లాడుతూ, ఫ్లాట్ అద్దెకు తీసుకునే సమయంలోనే ఆఫీసు కోసం అని చెప్పామని, అయితే ఈ విషయం ఓనర్ కు తెలుసు కానీ, అపార్ట్ మెంట్ అసోసియేషన్ కు తెలియదని చైతన్య వివరించారు.

అటు, అపార్ట్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ కూడా వివరణ ఇచ్చారు. చైతన్య, నిహారిక దంపతులు ఫ్లాట్ ను వాణిజ్య పరమైన కార్యకలాపాల కోసం వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని, వారు ఆఫీసు కోసం అద్దెకు తీసుకున్న విషయం తమకు తెలియదని అంగీకరించారు. అందుకే స్వల్ప వివాదం చోటు చేసుకుందని, అయితే ఇప్పుడు అందరం కలిసి చర్చించుకోవడంతో సమస్య పరిష్కారమై, సానుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు.

More Telugu News