flipcart: ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నోటీసులు

  • విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘ‌న ఆరోప‌ణ‌లు
  • ఎఫ్‌డీఐ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌డంపై విచార‌ణ‌
  • 1.35 బిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించే అవ‌కాశం
  • ఎందుకు విధించ‌కూడ‌ద‌న్న విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులు
Notice To Flipkart  Over Alleged Forex Violations

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న‌ ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తో పాటు దాని వ్య‌వ‌స్థాప‌కులు, మ‌రో తొమ్మిది మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చ‌ట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను వారిపై 1.35 బిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానాను ఎందుకు విధించ‌కూడ‌ద‌న్న విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ సంస్థ 2009 నుంచి 2015 మ‌ధ్య విదేశీ మారక నిర్వహణ చట్టం నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టింద‌ని ఈడీ వ‌ర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 'విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స‌హా భార‌త చ‌ట్టాలు, నిబంధ‌న‌ల‌న్నింటికీ క‌ట్టుబ‌డి సంస్థ న‌డుచుకుంటుంది.  2009 నుంచి 2015 మ‌ధ్య విదేశీ పెట్టుబ‌డు‌లపై విచార‌ణ జ‌రుపుతోన్న‌ అధికారులకు స‌హ‌క‌రిస్తాం' అని పేర్కొంది.

కాగా, మార్కెట్‌లో ప‌లు సంస్థ‌ల విక్రేత‌ల‌ మ‌ధ్య‌ విపరీతమైన పోటీ ఉంటుంది. అయితే, కొంద‌రు విక్రేతలను మాత్రమే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థ‌లు ప్రోత్సహిస్తున్నాయని, వారి నుంచి మాత్ర‌మే వ‌స్తువులు కొంటూ అమ్మ‌కాలు జ‌రుపుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనితో పాటు, ఫెమా, ఎఫ్‌డీఐ నిబంధనలను ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ఉల్లంఘించాయన్న ఆరోప‌ణ‌ల‌పై కొంత కాలంగా విచార‌ణ జ‌రుగుతోంది.

More Telugu News