బాక్సింగ్ లో భారత్​ కు కాంస్య పతకం సాధించిన లవ్లీనా..అభినందనల వర్షం!

Lovlina Concedes In Semis Won Bronze
  • టర్కీకి చెందిన బిజినెజ్ చేతిలో ఓటమి
  • పోరాటం చేసినా దక్కని ఫలితం
  • అభినందించిన ప్రధాని మోదీ
భారత ఖాతాలో మరో ఒలింపిక్స్ పతకం చేరింది. ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64–69 కిలోలు) విభాగంలో బరిలో నిలిచిన ఆమె.. సెమీ ఫైనల్ లో ఓడిపోయింది. ఇవాళ జరిగిన బౌట్ లో టర్కీకి చెందిన బిజెనెజ్ సర్మినెలి చేతిలో ఓటమిపాలైంది. జడ్జిలంతా ఏకగ్రీవంగా బిజినెజ్ ను విజేతగా ప్రకటించారు.

వాస్తవానికి మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థి బిజినెజ్ పంచ్ ల వర్షం కురిపించింది. 5–0తో ముందంజ వేసింది. తర్వాతి రౌండ్ నుంచి బోర్గోహెయిన్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఏకగ్రీవంగా బిజెనెజ్ ను విజేతగా ప్రకటించారు. ఫలితంగా గెలుపోటములతో సంబంధం లేకుండా లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని గెలిచింది.
 
కాగా, విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్ కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. కాగా, కంచు పతకం సాధించిన లవ్లీనాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. దేశం మొత్తం గర్విస్తోందన్నారు. ఆమె విజయం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు.

కాగా, లవ్లీనా బోర్గోహెయిన్ అసోంలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చింది. కనీసం అక్కడ రోడ్డు సౌకర్యం కూడా లేదంటే నమ్మరేమో. ఆమె సెమీఫైనల్ చేరాక.. అక్కడ అధికారులు రోడ్డేశారు. గోలాఘాట్ జిల్లాలో అధికారులు చకచకా రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేశారు.
Go Back to Shorts
Tokyo Olympics
Olympics
Lovlina Borgohain
Boxing
Bronze

More Telugu News