Etela Rajender: ఈటల ఏడోసారీ గెలుస్తారన్న ఎమ్మెల్యే

  • రేపు ఈటల డిశ్చార్జి అవుతారన్న రాజాసింగ్
  • రఘనందన్ రావుతో కలిసి పరామర్శ
  • పాదయాత్ర మొదలుపెడతారని వెల్లడి
Rajasingh Expresses Confidence Eatala Win In Huzurabad

అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ లు పరామర్శించారు. ఈరోజు వారిరువురూ ఆసుపత్రిలో ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని, రేపు డిశ్చార్జి అవుతారని రాజాసింగ్ చెప్పారు. ప్రజాదీవెన పాదయాత్రను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈటల ఏడోసారీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, వీణవంకలో పాదయాత్ర చేస్తుండగా ఈటల నీరసించిపోయిన సంగతి తెలిసిందే. జ్వరం రావడం, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో నిమ్స్ కు తరలించాల్సిందిగా ఆయన్ను పరిశీలించిన వైద్యులు చెప్పారు. ముందు నిరాకరించినా.. ఆ తర్వాత మరింత నీరసించిపోవడంతో అపోలో ఆసుపత్రిలో చేరారు. నిన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కోర్ కమిటీ సభ్యుడు వివేక్ లు ఆయన్ను పరామర్శించారు.

More Telugu News