Telangana: వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే మాల్స్, హోటల్స్ లోకి అనుమతించే అవకాశం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

  • కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదు
  • పాజిటివ్ ఉన్న వారు కూడా ఇష్టానుసారం బయట తిరుగుతున్నారు
  • డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు రెండు నమోదయ్యాయి
Second wave is still in Telangana says Public Health Director

తెలంగాణలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అయితే సెకండ్ వేవ్ ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదని వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

పాజిటివ్ నిర్ధారణ అయిన వారు ఐసొలేషన్ లో ఉండకుండా... ఇష్టానుసారం బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో కేసులు అధికంగా వస్తున్నాయని చెప్పారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయని శ్రీనివాస్ అన్నారు. రాబోయే రోజుల్లో కేవలం వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే మాల్స్, హోటల్స్ లోకి అనుమతించే అవకాశం ఉందని చెప్పారు.
 
డెల్టా వేరియంట్ ఇండియాతో పాటు 135 దేశాల్లో ప్రభావం చూపిందని శ్రీనివాస్ తెలిపారు. కొన్ని దేశాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఇద్దరూ కోలుకున్నారని, వారికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని అన్నారు.
 
తెలంగాణలో థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. సరిపడా వైద్య సిబ్బంది, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో 26 వేల బెడ్స్ కి ఆక్సిజన్ సదుపాయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 100కు పైగా బెడ్స్ ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి ఆగస్ట్ నెలాఖరుకు ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News