Nakka Anand Babu: సమస్యే లేదు... నేను వెళ్లి తీరుతా: పోలీసుల తీరుపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం

  • కొండపల్లిలో అక్రమ మైనింగ్ అంటూ టీడీపీ ఆరోపణలు
  • నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు
  • రేపు పర్యటన
  • టీడీపీ నేతలకు గృహనిర్బంధం
Nakka Anand Babu gets anger on police at his residence

కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, రేపు ఆ ప్రాంతంలో పరిశీలనకు తాము వెళుతున్నామని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోలీసులు ముందస్తుగా టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

గుంటూరులో నక్కా ఆనంద్ బాబును గృహనిర్బంధం చేసి ఇంటి తలుపులు వేశారు. దాంతో, ఆనంద్ బాబు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించారు. తాను వ్యక్తిగత పనిమీద బయటికి వెళ్లాల్సి ఉందని, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తన ఇంటికి వచ్చి తలుపులు వేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

"నువ్వెవరు నా ఇంటికి వచ్చి తాళం వేస్తున్నావ్? ఏమనుకుంటున్నావ్? తాళాలు వేయమని చెప్పారా మీకు?" అంటూ ఓ పోలీసు అధికారిపై నిప్పులు చెరిగారు. దాంతో, ఆ పోలీసు అధికారి స్పందిస్తూ, "మీరు లోపలికి పదండి సార్.. రెండు నిమిషాలు కూర్చోండి.. దయచేసి సహకరించండి సార్" అంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.

దాంతో నక్కా ఆనంద్ బాబు ప్రతిస్పందిస్తూ... "సమస్యే లేదు... నువ్వు అడ్డంపడొద్దు... నువ్వొచ్చి నన్ను ఆపేదేంటి?నేను వెళ్లి తీరుతా" అని స్పష్టం చేశారు. అయితే పోలీసులు తమ పట్టువిడవకుండా మాజీమంత్రిని గృహనిర్బంధం చేశారు.

More Telugu News