Raj Kumar: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు

  • రాజ్ కుమార్ కుటుంబం నుంచి హీరోయిన్ గా వస్తున్న ధన్య
  • రాజ్ కుమార్ కూతురు పూర్ణిమ కుమార్తే ధన్య
  • త్వరలో విడుదల కానున్న ధన్య సినిమా 'నిన్నా సానిహకే'
Raj Kumar grand daughters entry as heroine

దక్షిణాది సినీ పరిశ్రమ ఖ్యాతిని నలుమూలలా చాటిన ప్రముఖుల్లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఒకరు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ల సమకాలికులైన ఆయన కన్నడ సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా తనదైన ముద్రను వేశారు. ఆయన కుమారులు కూడా శాండల్ వుడ్ లో అగ్రనటులుగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన కుటుంబం నుంచి మూడో తరం ఎంట్రీ ఇస్తోంది. రాజ్ కుమార్ మనవరాలు (రాజ్ కుమార్ కూతురు పూర్ణిమ, రామ్ కుమార్ దంపతుల కూతురు) ధన్యా రామ్ కుమార్ సినీ రంగంలోకి అడుగు పెట్టారు. తాజాగా కన్నడలో తెరకెక్కిన 'నిన్నా సానిహకే' సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు.

కోవిడ్ కారణంతో ఈ చిత్రం ఇంత వరకు విడుదల కాలేదు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండటంతో... ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ  సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. మరోవైపు సినీరంగ ప్రవేశం చేయడంపై ధన్య ఆనందం వ్యక్తం చేసింది.

తమ తాతగారు ఒప్పుకోకపోవడం వల్లే తమ కుటుంబంలో మహిళలు ఎవరూ సినీ పరిశ్రమలోకి రాలేదని కొందరు మాట్లాడుకుంటున్నారని ధన్య అన్నారు. ఈ విషయం గురించి తాను అమ్మతో మాట్లాడానని... అయితే భద్రతా పరమైన కారణాల వల్లే ఇలా జరిగిందని అమ్మ చెప్పారని తెలిపారు. మీటూ ఉద్యమం వల్ల ఇప్పుడు మాట్లాడినట్టు అప్పట్లో నటీమణులు స్వేచ్ఛగా మాట్లాడే వీలు లేకపోయి ఉండొచ్చని... తాతగారు ఇప్పుడు ఉండుంటే... తాను హీరోయిన్ గా చేసేందుకు ఒప్పుకునేవారని చెప్పారు. సినీ రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని అనుకుంటున్నానని తెలిపారు. రాజ్ కుమార్ కుటుంబం నుంచి వస్తున్న తొలి హీరోయిన్ ధన్యా రామ్ కుమార్ కావడం గమనార్హం.

More Telugu News