Girl: జీన్స్ వేసుకుందని అమ్మాయిని కొట్టి చంపిన బంధువులు!

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • బ్రిడ్జికి వ్రేలాడుతూ అమ్మాయి శవం
  • జీన్స్, టాప్ తో గుడికి వెళ్లాలనుకున్న అమ్మాయి
  • కర్రలతో కొట్టిన బంధువులు
Girl killed after wearing jeans against family members will

భారత్ లోనూ పలు ప్రాంతాల్లో ఇంకా ఛాందసులు ఉన్నారన్న విషయాన్ని ఈ ఘటన నిరూపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో 17 ఏళ్ల ఓ టీనేజ్ అమ్మాయిని కుటుంబ సభ్యులే కొట్టి చంపారు. అందుకు కారణం ఆమె జీన్స్ ప్యాంట్ ధరించడమే. యూపీలో దియోరియా జిల్లాలో ఓ బ్రిడ్జి రెయిలింగ్ కు అమ్మాయి శవం వ్రేలాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించడం కలకలం రేపింది.

ఆ అమ్మాయి కుటుంబం ఉపాధి కోసం పంజాబ్ కు వలస వెళ్లింది. ఇటీవలే ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చింది. కాగా, ఆ అమ్మాయి జీవనశైలిపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఓ రోజు ఆమె ఉపవాసం చేసి, ఆ సాయంత్రం జీన్స్ ప్యాంట్, టాప్ ధరించి గుడికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో తండ్రి ఆమెను వారించాడు. ఆ వేషధారణ సరికాదని అన్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తన వేషధారణ మార్చుకోకపోవడంతో అక్కడే ఉన్న ఇతర బంధువులు ఆమెపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు.

స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పి, బ్రిడ్జి పైనుంచి విసిరేశారని తల్లి చెబుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆ అమ్మాయి బంధువర్గంలోని ఓ మహిళ మాట్లాడుతూ, ఆ అమ్మాయి, ఆమె తల్లిపై ఇతర బంధువుల్లో అసూయ ఉండేదని, వారి వేషధారణ, వారి ఆహారపు అలవాట్లను ఓర్వలేకపోయేవారని వివరించింది.

More Telugu News