China: ఉత్తరాఖండ్ వద్ద సరిహద్దు ప్రాంతంలో చైనా కదలికలు తీవ్రం

  • 6 నెలల తర్వాత చైనా గస్తీ ముమ్మరం
  • హెలికాప్టర్లు, డ్రోన్ల సంచారం
  • ఇటీవలి వరకు స్తబ్దుగా ఉన్న చైనా
  • తాము సన్నద్ధంగానే ఉన్నామన్న భారత సైన్యం
China troops activities at Barahoti

గత 6 నెలలుగా ఉత్తరాఖండ్ లోని  బరాహోతి ప్రాంతానికి సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద స్తబ్దుగా ఉన్న చైనా, తాజాగా కదలికలు తీవ్రతరం చేసింది. ఎల్ఏసీకి సమీపంలోని తన భూభాగంలో గస్తీని ముమ్మరం చేసింది.

అటు, బరాహోతి సమీపంలోని తన ఎయిర్ బేస్ లోనూ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు, డ్రోన్ల సంచారం అధికమైంది. కాగా, చైనా గస్తీపై భారత సైన్యాధికారులు స్పందించారు. బరాహోతి ప్రాంతంలో చైనా దళాలు దర్శనమిస్తున్నాయని వెల్లడించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు.

ఇటీవల కాలంలో భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే, బరాహోతి ప్రాంతంలో మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. అయినప్పటికీ భారత సైన్యం ఇక్కడ భారీగా మోహరింపులు చేపట్టి, చైనా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.

More Telugu News