rain: తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

  • హైద‌రాబాద్- విజ‌య‌వాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్  
  • నిన్న‌టి నుంచి జీహెచ్ఎంసీ ప‌రిధిలో ముసురు
  • అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాలు
  • నిర్మల్ పట్టణానికి ఎన్డీఆర్ఎఫ్‌ను పంపాల‌ని సూచ‌న‌
  • గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌న్న సీఎం
kcr on rains

తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వ‌ర్షం ప‌డుతుండ‌డంతో ప‌లు చోట్ల రోడ్లు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. హైద‌రాబాద్- విజ‌య‌వాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కావ‌డంతో వాహ‌నాలు న‌త్త‌న‌డ‌క‌న ముందుకు సాగుతున్నాయి.

అంతేగాక‌, నిన్న సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ స‌మీపంలో ఓ లారీ బోల్తా ప‌డడం, అనంత‌రం కుండ‌పోత వ‌ర్షం ప‌డ‌డంతో లారీని తొల‌గించే ప్ర‌క్రియ‌కు అంత‌రాయం క‌లిగింది. ఆ లారీ జాతీయ ర‌హ‌దారిపైనే ఉంది. దాన్ని ప‌క్కకు జ‌రిపేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. మొద‌ట ఆ లారీలోని తోళ్ల‌ను మ‌రో లారీలోకి లోడ్ చేస్తున్నారు.

మ‌రోవైపు, నిన్న‌టి నుంచి జీహెచ్ఎంసీ ప‌రిధిలో ముసురు పట్టింది. విరామం లేకుండా చినుకులు ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.  

తెలంగాణ‌లోని పలు జిల్లాల్లో గ‌త‌ రాత్రంతా ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వ‌ర్షాలు పడడంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా చాలా ప్రాంతాలు నీటమునగ‌డంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

అలాగే, ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద పెరుగుతున్నందున వెంట‌నే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రాకూడ‌ద‌ని సీఎం కేసీఆర్ సూచించారు.

ఆయా ప్రాంతాల టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవ‌కాశం ఉండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌న్నారు.

More Telugu News