Navjot Singh Sidhu: 23న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్న సిద్ధూ

  • అమరీందర్ సింగ్ కు ఆహ్వానం పంపిన సిద్ధూ 
  • ఈరోజు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ
  • అమృత్ సర్ లోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన
Navjot Singh Sidhu to take charge as PCC president on July 23

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల 23న పీసీసీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు కూడా ఆయన ఆహ్వానం పంపారు. పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జి హరీశ్ రావత్ ను కూడా ఆహ్వానించారు.

మరోవైపు అమరీందర్ పై చేసిన వ్యాఖ్యలకు సిద్ధూ క్షమాపణ చెప్పాలని... అంతవరకు ఆయనను అమరీందర్ కలిసే అవకాశమే లేదని ఆయన మీడియా సలహాదారు రవీన్ తుక్రా నిన్ననే సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ కోసం అమరీందర్ సింగ్ ఎలాంటి సమయాన్ని కేటాయించలేదని అన్నారు. ఇంకోవైపు ఈరోజు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అమృత్ సర్ లోని తన నివాసంలో సిద్ధూ విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి స్వర్ణ దేవాలయంతో పాటు, పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు.

More Telugu News