కేంద్ర గెజిట్ గ్రేటర్ రాయలసీమకు గొడ్డలిపెట్టు: మైసూరారెడ్డి

MV Mysura Reddy Fires on AP And Telangana CMs
  • జల వివాదంపై చర్చించుకోవడానికి భేషజాలెందుకు?
  • ఇరు రాష్ట్రాలు గొడవ పడి అధికారాన్ని కేంద్రానికి అప్పగించాయి 
  • రాయలసీమకూ ఓ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలవివాదంపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఘర్షణ పడి అధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టేశాయని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి గొడ్డలిపెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి కూడా ఓ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పుడీ పరిస్థితి తలెత్తి ఉండేది కాదన్నారు. కేంద్ర గెజిట్ వల్ల హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు నీరు రావడం ఇక కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. జల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవడానికి భేషజాలెందుకని ప్రశ్నించారు. రాయలసీమ హక్కుల కోసం ప్రభుత్వం ఎందుకు పోరాడలేకపోతోందని నిలదీశారు. రాష్ట్ర సమగ్రతకు ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని మైసూరారెడ్డి హితవు పలికారు.
Go Back to Shorts
Mysurara Reddy
Andhra Pradesh
Telangana
Water Disputes
Rayalaseema

More Telugu News