Bird Flu: భారత్‌లో తొలి బర్డ్ ఫ్లూ మరణం.. ఐసోలేషన్‌లోకి వైద్యులు, సిబ్బంది

  • హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడి మృతి
  • ఈ నెల 2 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స
  • బర్డ్ ఫ్లూ సోకినట్టు పూణె ల్యాబ్ నిర్ధారణ
India registered first Bird Flu Death

హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్ ఫ్లూకు చికిత్స పొందుతూ చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ఇదే తొలి బర్డ్ ఫ్లూ మరణం. బాలుడు చనిపోవడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో అతడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లారు. న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో బాధపడుతున్న బాలుడు ఈ నెల 2న ఎయిమ్స్‌లో చేరాడు. అతడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడి పరీక్షల్లో బాలుడికి సోకింది బర్డ్ ఫ్లూ అని గుర్తించారు.

బర్డ్‌ఫ్లూ అనేది నిజానికి కోళ్లు, పక్షుల్లో వస్తుంది. దీనిని హెచ్5ఎన్1 వైరల్ లేదంటే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఈ ఏడాది మొదట్లో మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో వణికాయి. వేలాది పక్షులు నేలరాలాయి. ఒక్క పంజాబ్‌లోనే 50 వేలకు పైగా పక్షులు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడం అరుదని నిపుణులు చెబుతున్నారు. భయపడాల్సినంత ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు.

More Telugu News