Bakird: ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్, సీఎం

AP Governor and CM conveys Bakrid wishes to people
  • రేపు బక్రీద్ పర్వదినం
  • ట్విట్టర్ లో స్పందించిన గవర్నర్, సీఎం
  • సంపూర్ణ భక్తి విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్న గవర్నర్
  • ప్రజలకు అల్లా ఆశీస్సులు ఉండాలన్న సీఎం జగన్
రేపు బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను త్యాగనిరతి, భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, పేదల పట్ల దయ, దాతృత్వానికి ప్రతీకగా జరుపుకుంటారని గవర్నర్ అభివర్ణించారు. అయితే, పండుగ నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం విస్మరించరాదని పిలుపునిచ్చారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని సూచించారు.

అటు సీఎం జగన్ స్పందిస్తూ... రేపు బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాశాంక్షలు అంటూ ప్రకటన చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Bakird
Wishes
Governor
Biswabhusan Harichandan
CM Jagan
Andhra Pradesh

More Telugu News