USA: కళకళలాడుతున్న అమెరికా విమానాశ్రయాలు.. లక్షలాదిమందితో కిటకిట

  • ఆదివారం ఒక్కరోజే 22 లక్షలమందికిపైగా ప్రయాణికుల స్క్రీనింగ్
  • నెమ్మదిగా కుదుట పడుతున్న దేశీయ విమానయాన రంగం
  • అంతర్జాతీయ ప్రయాణాలపై కొనసాగుతున్న ఆంక్షలు
US airports busy with passengers after 18 months

కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికాలో నెమ్మదిగా కరోనా ముందునాటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడాదిన్నర తర్వాత విమానాశ్రయాలు మళ్లీ ప్రయాణికులతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. దేశీయ ప్రయాణాలు, విహారయాత్రలకు ప్రజలు ముందుకొస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ కలిపి 22 లక్షలమందికి పైగా ప్రయాణికుల స్క్రీనింగ్ జరిగినట్టు అమెరికా రవాణా భద్రతా విభాగం తెలిపింది. ఈ స్థాయిలో ప్రయాణికులు స్క్రీనింగ్ కావడం గతేడాది మార్చి తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది. అయితే, అంతకుముందు ఏడాది (2019) ఇదే సమయంతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువని తెలిపింది.

మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండడంతో ఆ ప్రభావం విమానయాన సంస్థలపై భారీగానే ఉంది. దేశీయంగా విమాన ప్రయాణాలు మునుపటి స్థాయికి చేరుకుంటున్నా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షల కారణంగా విమానయాన సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి.

More Telugu News