Venkatesh: వెంకటేశ్ సినిమాలకు రూ.75 కోట్ల ఓటీటీ డీల్?

  • ఓటీటీ ద్వారా వెంకీ సినిమాలు రెండు 
  • 'అమెజాన్' ద్వారా ఈ 20న 'నారప్ప' 
  • రూ.40 కోట్లతో అమెజాన్ డీల్ 
  • 'దృశ్యం 2'కి రూ.35 కోట్ల ఒప్పందం 
Huge OTT deal for Venkatesh films

ఓటీటీ వేదికలు ఇప్పుడు దూకుడు మీదున్నాయి. ఈ రంగంలోకి కొత్త సంస్థలు కూడా వస్తుండడంతో వాటి మధ్య పోటీ పెరుగుతోంది. దాంతో సినిమాల డైరెక్టు రిలీజ్ విషయంపై బాగా దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలో రిలీజ్ కాకుండా.. డైరెక్టుగా తమ వేదికలపైనే రిలీజ్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాయి. ఇందుకోసం భారీ మొత్తాలను ఆఫర్ చేస్తూ ఆయా క్రేజీ చిత్రాలకు గాలం వేస్తున్నాయి. ఓపక్క కోవిడ్ నిబంధనలతో థియేటర్లు కూడా తెరుచుకోకపోవడంతో ఆయా నిర్మాతలు కూడా ఓటీటీలకు తమ సినిమాలను అమ్మేసుకునే విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రనటుడు వెంకటేశ్ నటించిన రెండు సినిమాలు తాజాగా ఓటీటీల ద్వారా డైరెక్టుగా విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు సుమారు 75 కోట్లను ఓటీటీ వేదికలు ఆఫర్ చేశాయి. ఇందులో మొదటి చిత్రం 'నారప్ప'. థియేటర్లో రిలీజ్ చేయాలని ఇన్నాళ్లూ ఎదురుచూసిన నిర్మాతలు ఇటీవలే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి ఇచ్చేశారు. ఈ నెల 20న ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలవుతోంది. ఇందుకోసం సదరు సంస్థ రూ.40 కోట్లను హక్కుల రూపంలో నిర్మాతలకు ఇచ్చిందట.

ఇక వెంకటేశ్ నటించిన మరో చిత్రం 'దృశ్యం 2' కూడా ఓటీటీ ద్వారానే రిలీజ్ కానున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ తీసుకుందని అంటున్నారు. దీనికి రూ.35 కోట్లతో డీల్ జరిగినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వెంకీ నటించిన రెండు కొత్త చిత్రాలు ఇలా రూ.75 కోట్లకు ఈ డైరెక్టు రిలీజ్ ద్వారా డీల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.  

More Telugu News