Chandrababu: వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు: చంద్రబాబు

  • అవినీతి గురించి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు
  • పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
  • అన్నీ గుర్తు పెట్టుకుంటాం
Chandrababu visits Dhulipala Narendra residence

వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.

వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడితే వెంటనే కేసులు పెట్టేస్తున్నారని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారించడానికి కోర్టులు సరిపోవని చెప్పారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రజలను, టీడీపీ నేతలను ఎలా హింసిస్తున్నారో అన్నీ గుర్తు పెట్టుకుంటామని... భవిష్యత్తులో అన్నింటిపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. తమ హయాంలో రాయలసీమ ముఠా కక్షలపై కఠినంగా వ్యవహరించి ప్రశాంతతను తీసుకొచ్చామని... ఇప్పుడు మళ్లీ హత్యారాజకీయాలను ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News