Raghunandan Rao: వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరు: బీజేపీ నేత రఘునందన్ రావు

  • హుజూరాబాద్ లో ఈటలదే గెలుపు
  • నోట్లు వెదజల్లినా ప్రజలు ఈటలకే పట్టం కడతారు
  • ఇన్నేళ్లలో టీఆర్ఎస్ ఒక బీసీ నేతను కూడా తయారు చేసుకోలేకపోయింది
Even 100 CMs can not stop Etela victrory says Raghunandan Rao

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో లక్ష మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా అదే తరహా ప్రకటనలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని... నోట్ల కట్టలు వెదజల్లినా ప్రజలు ఈటలకే పట్టం కడతారని చెప్పారు.

దుబ్బాక ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ఎంత కష్టపడి పని చేసిందో... హుజూరాబాద్ లో కూడా అదే విధంగా పని చేస్తామని రఘునందన్ రావు అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, ఏడేళ్ల అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇన్నేళ్లలో ఒక్క బలమైన బీసీ నేతను కూడా తయారు చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన గెలుపు రాదని చెప్పారు. హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.

More Telugu News