iraq: బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయమే ల‌క్ష్యంగా రాకెట్ దాడులు

  • దూసుకొచ్చిన‌ రెండు రాకెట్లు
  • ర‌క్షించిన‌ యాంటీ రాకెట్ వ్య‌వ‌స్థ‌లు
  • కార్యాల‌యంపై ప‌దే ప‌దే దాడులు
Rocket attack targets US embassy inside Baghdads Green Zone

ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం వ‌ద్ద ఈ రోజు ఉద‌యం క‌ల‌క‌లం చెల‌రేగింది. రాయబార కార్యాలయం ల‌క్ష్యంగా రెండు రాకెట్లతో దాడి జ‌రిగింది. అయితే, యాంటీ రాకెట్ వ్య‌వ‌స్థ‌ల వల్ల‌ రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని అక్క‌డి అధికారులు చెప్పారు.

ఇటీవ‌లే ఇరాక్ లోని అమెరికా స్థావరంపై రాకెట్, డ్రోన్ల‌తో దాడులు జరిగాయి. దీనిపై నిన్న అమెరికా మండిప‌డింది. ఈ దాడులను ఇరాన్ మద్దతుదారులు చేశారని ఆరోపించింది. అమెరికా విమ‌ర్శ‌లు చేసిన కొన్ని గంట‌ల్లోనే రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్ దాడులు జరగ‌డం గ‌మానార్హం. బాగ్దాద్‌లోని అమెరికా రాయ‌బార కార్యాల‌యం ప‌టిష్ఠ‌ భద్రత నడుమ ఉంటుంది.

రాకెట్లు దూసుకొచ్చిన నేప‌థ్యంలో యాంటీ రాకెట్ వ్య‌వ‌స్థ‌లు వాటిని దారి మళ్లించడంతోనే పెను ప్ర‌మాదం త‌ప్పింది. వ‌రుస‌గా రెండు రాకెట్లు దూసుకొచ్చినా ఏమీ కాలేదు. ఈ ఏడాది ఇప్ప‌టికి బాగ్దాద్ లోని అమెరికా స్థావరాలపై 47 సార్లు డ్రోన్ల‌ దాడులు జరిగాయి.

More Telugu News