England Team: ఇంగ్లండ్ జట్టులో కరోనా కలకలం.... ఆగమేఘాలపై మరో జట్టును ప్రకటించిన ఈసీబీ

  • పాకిస్థాన్ తో ఆడాల్సిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు కరోనా
  • బెన్ స్టోక్స్ నాయకత్వంలో మరో జట్టు ఎంపిక
  • పలువురు యువ ఆటగాళ్లకు చోటు
  • మంచి అవకాశమన్న ఇంగ్లండ్ క్రికెట్ ఎండీ
ECB selects new team under Ben Stokes captaincy

పాకిస్థాన్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కరోనా సోకడంతో జట్టులో మిగిలిన అందరినీ ఐసోలేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పాకిస్థాన్ తో సిరీస్ ఆడేందుకు ఆగమేఘాలపై మరో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. మాజీ ఆటగాడు క్రిస్ సిల్వర్ వుడ్ ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తాడని ఈసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇంగ్లండ్ తాజా జట్టు ఇదే...

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, లూయిస్ గ్రెగరీ, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, సకిబ్ మెహమూద్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఒవర్టన్, మాట్ పార్కిన్సన్, డేవిడ్ పేన్, ఫిల్ సాల్ట్, జాన్ సింప్సన్, జేమ్స్ విన్స్.

దీనిపై ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ మాట్లాడుతూ, తాజా పరిణామాల నేపథ్యంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు కొత్త ఆటగాళ్లకు ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

More Telugu News