OPEC: ఒపెక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన క్రూడాయిల్ ధర!

  • ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్
  • ఉత్పత్తి పెంచేందుకు అంగీకరించని యూఏఈ
  • 2 శాతం మేరకు పెరిగిన ధర
  • నేడు మరో కీలక సమావేశం జరపనున్న ఒపెక్
Crude Oil Price Hike Amid OPEK Desission

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లకు డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు మరో 2 శాతం మేరకు పెరిగాయి. తాజాగా జరిగిన ఒపెక్ సభ్య దేశాల సమావేశంలో ఉత్పత్తిని పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని దేశాలు వ్యతిరేకించడం కూడా ధర పెరుగుదలకు కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు.

ఆగస్టు నుంచి రోజుకు 20 లక్షల బ్యారర్ల ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ నిర్ణయించగా, సభ్య దేశాల్లో కీలకమైన యూఏఈ దాన్ని వ్యతిరేకించింది. యూఏఈ వ్యతిరేకించడంతో ఒపెక్ సమావేశం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడగా, ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

గురువారం నాడు బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.22 డాలర్లు (1.6 శాతం) పెరిగి 75.84 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ క్రూడాయిల్ ధర 2.4 శాతం పెరిగి బ్యారల్ కు 75.23 డాలర్లకు చేరుకుంది. 2018 అక్టోబర్ తరువాత క్రూడాయిల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో పలు దేశాల్లో పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా, గురువారం నాడు సమావేశమైన ఒపెక్ సభ్యదేశాలు కొంతమేరకు ఉత్పత్తిని పెంచి, డిమాండ్ ను అనుసరించి క్రూడాయిల్ ను అందించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను గమనించి, ఒపెక్ నిర్ణయం తీసుకోవాలని, ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందని ఆయిల్ మార్కెట్ నిపుణుడు లౌసీడిక్సన్ వ్యాఖ్యానించారు. అన్ని దేశాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నందున ఒపెక్ సైతం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, యూఏఈ అభ్యంతరాలతో అర్థాంతరంగా వాయిదా పడిన ఒపెక్ సభ్య దేశాల సమావేశం నేడు కూడా కొనసాగనుంది. రాబోయే నెలల్లో క్రూడాయిల్ కు డిమాండ్ భారీగా పెరగనున్నదని, ఇదే అవకాశంగా తీసుకుని సభ్య దేశాలు లాభాలను పొందాలన్న ఆలోచనలో ఉన్న మిగతా దేశాలు, యూఏఈని ఒప్పించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి రోజుకు 30 లక్షల బ్యారళ్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనాలు వేసిన రైస్టడ్ ఎనర్జీ, ఆ మేరకు ఒపెక్ దేశాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని డిక్సన్ అంచనా వేశారు.

More Telugu News