YS Sharmila: తెలంగాణ నీటి కోసం ఎవరితో పోరాడేందుకైనా నేను సిద్ధం: వైయస్ షర్మిల

  • తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నాం
  • టీడీపీ నేత రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేశారు
  • తెలంగాణ ప్రయోజనాల కోసం మేము పోరాడతాం
I am ready to fight with anyone for Telangana water says YS Sharmila

తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపించబోతున్నట్టు వైయస్ షర్మిల తెలిపారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడటానికి నాలుగు స్తంభాలు చాలా ముఖ్యమని... అవి కూడా చేయలేనిది చేసేదే ఫిఫ్త్ ఎస్టేట్ అని... అదే సోషల్ మీడియా అని చెప్పారు. నెటిజెన్ల మద్దతు లేకుండా తాను ఏమీ చేయలేనని అన్నారు.

జులై 8వ తేదీన తమ పార్టీ ప్రకటన ఉంటుందని షర్మిల చెప్పారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిని చేసిందని తెలిపారు. టీఆర్ఎస్ కు సోషల్ మీడియా ఉద్యోగులు ఉన్నారని అన్నారు. కానీ, తమకు ఆ అవసరం లేదని, వైయస్సార్ అభిమానులే తమ సైన్యమని చెప్పారు. పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అన్ని విషయాలను లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా కార్యకర్తలందరూ యాక్టివ్ గా ఉండాలని సూచించారు. అన్యాయన్ని ఎదిరించేలా, ఫేక్ వార్తలను ఎండగట్టేలా అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.
 
ఇరు తెలుగు రాష్ట్రాల జలవివాదంపై ఆమె స్పందిస్తూ... తెలంగాణ ప్రయోజనాల కోసం తాము పోరాడతామని చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరినైనా ఎదిరించేందుకు తాము సిద్ధమేనని అన్నారు. తెలంగాణకు ఒక్క నీటి చుక్క అన్యాయం జరిగినా సహించబోమని హెచ్చరించారు.

More Telugu News