Alla Nani: చంద్రబాబువి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్ల నాని

  • సుష్టుగా తిని దీక్షలో కూర్చున్నారు
  • ఈ రోజు దీక్షతో చంద్రబాబు సాధించింది ఏమిటి?
  • చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాలి
Chandrababu playing worst politics says Alla Nani

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆళ్ల నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు గంటల పాటు చంద్రబాబు చేసిన దీక్షను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ ఆధోగతి పాలయిందని విమర్శించారు. కరోనాతో రాష్ట్రం అల్లాడుతున్న సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు జూమ్ మీటింగులు పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.

ఈరోజు దీక్షకు దిగే ముందు చంద్రబాబు సుష్టుగా తిని, తిన్నది అరిగేంత వరకు దీక్షను చేపట్టారని ఎద్దేవా చేశారు. దీక్ష ముగియగానే ఇంటికి వెళ్లి, తిని, పడుకోవడమేనా చంద్రబాబు పని అని ప్రశ్నించారు. ఈరోజు దీక్షతో చంద్రబాబు సాధించింది ఏమిటని ఎద్దేవా చేశారు.

కరోనా వల్ల కేవలం 12,700 మంది మాత్రమే చనిపోయారనే బాధ చంద్రబాబుకు ఉందా? అని నాని ప్రశ్నించారు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లోనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఉందనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. తనను ఓడించిన ప్రజలు లక్షల సంఖ్యలో చనిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారా? అని అడిగారు. చంద్రబాబు కుట్రలను ప్రజలందరూ గమనించాలని అన్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News