C Kalyan: సినీ నిర్మాత సి.కల్యాణ్ పై భూవివాదం కేసు నమోదు

  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
  • 1985 లో ఫిలింనగర్ సొసైటీలో భూమి కొనుగోలు చేసిన ఎన్నారై డాక్టర్
  • ఆ స్థలంలోకి ప్రవేశించిన కల్యాణ్ మనుషులు
Case filed against tollywood producer C Kalyan

టాలీవుడ్ సినీ నిర్మాత సి.కల్యాణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, తనను బెదిరిస్తున్నారంటూ ఫిలింనగర్ కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షరూఫ్‌, తేజస్వి, శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు తన భూమిలోకి ప్రవేశించి, బెదిరిస్తున్నారని గోపీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, కల్యాణ్ తో పాటు మిగిలిన ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, స్వరూప్ అనే వ్యక్తి అమెరికాలో డాక్టర్ గా పని చేస్తున్నారు. 1985లో ఫిలింనగర్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశారు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి ఆ భూమిని లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో నారాయణమూర్తి ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నారు. అయితే, సోమవారం సాయంత్రం ఆ స్థలంలోకి కల్యాణ్ మనుషులు వచ్చారు. ఆర్గానిక్ స్టోర్ కు తాళం వేశారు. దీంతో, స్వరూప్ సోదరుడు గోపీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, భూ వివాదం కేసుల్లో సి.కల్యాణ్ చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. కొందరు ఆయనపై పోలీసు కేసులు కూడా పెట్టారు.

More Telugu News