Rozer Federer: నేటి నుంచి వింబుల్డన్... ఫెదరర్, సెరీనాలకు చివరిదేనా?

  • దాదాపుగా 40కి చేరుకున్న వయసు
  • గాయాలతో బాధపడుతున్న ఫెదరర్
  • చివరి వింబుల్డన్ కావచ్చంటున్న క్రీడా పండితులు
Will It Will be the Last Wimbledon for Federer and Sereena

ఆకుపచ్చని గడ్డితో నిండిన మైదానంపై జరిగే ఏకైక టెన్నిస్ గ్రాండ్ స్లామ్, వింబుల్డన్ నేటినుంచి ప్రారంభంకానుంది. గతంలో వరల్డ్ నంబర్ వన్ గా ఉండటంతో పాటు, పలుమార్లు టైటిల్స్ ను గెలుచుకున్న రోజర్ ఫెదరర్ తో పాటు సెరీనా విలియమ్స్ లు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. వీరిద్దరికీ ఇదే చివరి వింబుల్డన్ కావచ్చని క్రీడా పండితులు భావిస్తున్నారు. వీరిద్దరి వయసూ 40ల్లో పడటమే ఇందుకు కారణం.

నాలుగేళ్ల క్రితం ఒలింపియాకు జన్మనిచ్చిన తరువాత, సెరీనా విలియమ్స్ ఇప్పటివరకూ ఒక్క మేజర్ టైటిల్ ను కూడా గెలవలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ ను సంపాదించిన ఆమె, వింబుల్డన్ లో విజయం సాధించి, ఎనిమిదో టైటిల్ ను గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది.

ఇక వింబుల్డన్ పూర్తయిన నాలుగు వారాల్లో ఫెదరర్ వయసు 40కి చేరుతుంది. ఇటీవలి కాలంలో మోకాలి సర్జరీ చేయించుకున్న ఫెదరర్, గతంలో రాణించిన స్థాయిలో సత్తా చూపగలడా? అన్న అనుమానాలున్నాయి. "పదేళ్ల క్రితం నేను 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పీట్ సాంప్రాస్ తో మాట్లాడాను. ఆ సమయంలో నేను 40 ఏళ్లు వచ్చే వరకూ ఆడతానన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు కూడా మైదానంలో ఆడనుండటం అద్భుతంగా ఉంది" అని ఫెదరర్ వ్యాఖ్యానించారు.

ఏదిఏమైనా, టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న ఫెదరర్, సెరీనాలు తమ ఆట తీరుతో సాధ్యమైనంత ఎక్కువ మ్యాచ్ లు గెలిచి, టైటిల్ పోరుకు దగ్గర కావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఓటమిని అంత తేలికగా అంగీకరించే అలవాటు లేని ఫెదరర్ ను ఎదుర్కోవడం యువ ఆటగాళ్లకు అంత సులభమేమీ కాదనడంలో సందేహం లేదు.

More Telugu News