gutta: అప్పుడు వైఎస్సార్‌.. ఇప్పుడు జ‌గ‌న్: గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమ‌ర్శ‌లు

  • కృష్ణా జలాలను దోచుకుపోవాలని య‌త్నాలు
  • రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు అన్యాయం
  • శ్రీశైలం డ్యామ్ నుంచి 800 ఫీట్ల నుంచే నీళ్లు తీసుకుపోతానన‌డం స‌రికాదు
gutta slams jagan

కృష్ణా జలాలను దోచుకుపోవాలని అప్పట్లో వైఎస్సార్ దుర్బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తే ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా అదే తీరుతో ముందుకు వెళ్తున్నార‌ని తెలంగాణ‌ శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ నిర్మిస్తోన్న‌ రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.

వైఎస్సార్ పాల‌న‌లో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని ఆయ‌న అన్నారు. ఈ తీరును అప్పట్లోనూ తాము వ్యతిరేకించామని చెప్పారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా అటువంటి చ‌ర్య‌ల‌కే పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం డ్యామ్ నుంచి 800 ఫీట్లు నుంచే నీళ్లు తీసుకుపోతామ‌ని చెప్ప‌డం ఏంట‌ని నిల‌దీశారు.

దీని వ‌ల్ల తెలంగాణ‌కు నష్టం వాటిల్లుతుంద‌ని చెప్పారు. ఆ ప్రాజెక్టును తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, జగన్ మాత్రం చాటుగా పనులు చేసుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. కేసీఆర్ పాల‌న‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జ‌రిగింద‌ని, దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండున్నల లక్షల ఎకరాలకు నీరు అందుతోంద‌ని తెలిపారు.


More Telugu News