Vishnu Vardhan Reddy: తెలంగాణ మంత్రులు అనవసర రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు: ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నాటకం
  • అన్నీ తెలిసీ జగన్ కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు
  • అనుమతులు లేకుండా తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు
TS ministers creating unnecessary problem says Vishnu Vardhan Reddy

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. తమ జలాలను ఏపీ ప్రభుత్వం దోచుకుంటోందని తెలంగాణ మంత్రులు విమర్శిస్తున్నారు. నిబంధనల మేరకు తాము జలాలను వాడుకుంటున్నామని ఏపీ మంత్రులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఈ నాటకంలో భాగస్వాములయ్యాయని విష్ణు అన్నారు. అన్నీ తెలిసే జగన్ ప్రభుత్వం, ఏపీ మంత్రులు కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో అనుమతులు లేకుండానే ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారని... వాటికి తెలంగాణ ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని విష్ణు ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు బీజేపీపై అనవసర విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ నెల 28న ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశం కానుందని, ఈ సమావేశంలో అన్ని విషయాలను చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఓ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి, కేంద్ర మంత్రులను కలిసి, అన్ని అంశాలను వివరిస్తుందని తెలిపారు.

More Telugu News