Nara Lokesh: ఏపీలో పరీక్షలు రద్దు చేయడం సంతోషదాయకం: నారా లోకేశ్

  • ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
  • సర్కారు నిర్ణయంపై లోకేశ్ స్పందన
  • రాష్ట్ర ప్రభుత్వ రాక్షస క్రీడ ముగిసిందని వ్యాఖ్య  
  • విద్యార్థులను హింసించారన్న లోకేశ్ 
Nara Lokesh welcomes govt decision on exams cancellation

ఆంధ్రప్రదేశ్ లో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం పట్ల టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షసక్రీడ ముగిసిందని తెలిపారు. రెండు నెలల పోరాటం తర్వాత వైఎస్ జగన్ గారు దిగొచ్చి పరీక్షలు రద్దు చేయడం సంతోషం అని పేర్కొన్నారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

"మొండిపట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18న నేను మొదటి లేఖ రాసినప్పుడే పరీక్షలు రద్దు చేసి ఉంటే విద్యార్థులకు విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండడంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేది. మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదు... మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు" అని వ్యాఖ్యానించారు.

తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను హింసించారని లోకేశ్ విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంతో చీవాట్లు తినే పరిస్థితి మరోసారి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ గారిని కోరుతున్నాను అంటూ స్పష్టం చేశారు.

More Telugu News