Measles: మీజిల్స్ టీకా తీసుకున్న చిన్నారులకు కరోనా ముప్పు తక్కువే!: తాజా అధ్యయనంలో వెల్లడి

  • కరోనా వైరస్‌పై 87.5 శాతం ప్రభావం చూపిస్తున్న మీజిల్స్ వ్యాక్సిన్లు
  • అధ్యయన వివరాలను ప్రచురించిన మెడికల్ జర్నల్
  • ఇలాంటి అధ్యయనం ప్రపంచంలో ఇదే తొలిసారన్న డాక్టర్ నీలేశ్ గుజార్
Measles vaccine may protect children against Covid

చిన్న పిల్లలకు తట్టు (మీజిల్స్) రాకుండా వేయించే టీకాల వల్ల వారికి కొవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్టు పూణెలోని బీజే మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మీజిల్స్ టీకాలు వేయించుకున్న పిల్లలకు ఒకవేళ కరోనా సోకినా దాని ప్రభావం వారిపై పెద్దగా ఉండదని పరిశోధనలో వెల్లడైంది. కరోనా వైరస్‌పై మీజిల్స్ టీకా 87.5 సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది.

ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాల వివరాలు హ్యూమన్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునోథెరప్యూటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మీజిల్స్ వ్యాక్సిన్ కారణంగా పిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుండడం నిజమే అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అధ్యయనకారులు తెలిపారు. ఇలాంటి అధ్యయనం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ నీలేశ్ గుజార్ తెలిపారు.

మీజిల్స్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలని డాక్టర్ నీలేశ్ సూచించారు. కాగా, ఈ అధ్యయనంలో భాగంగా 17 ఏళ్ల వయసున్న 548 మందిని రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారు. మీజిల్స్, బీసీజీ వ్యాక్సిన్లు కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్న వేళ తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News