కరోనా వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు అవసరమో, కాదో ఇప్పుడే చెప్పలేం: డబ్ల్యూహెచ్​ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య

Dont Count On Needing A Covid Booster Shot Says WHO Scientist
  • తొందరపాటే అవుతుందన్న చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్
  • బూస్టర్ డోసు సిఫార్సుకు సరైన సమాచారం లేదని కామెంట్
  • పేద దేశాలకు వ్యాక్సిన్ మరింత లేటవుతుందని ఆందోళన
ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లయితే అందుబాటులోకి వచ్చాయి. దాంతో పాటే మహమ్మారి ఆ వ్యాక్సిన్లకు చిక్కకుండా ఉండేందుకు మరిన్ని రూపాలను మార్చుకుంటోంది. మానవాళికి మరింత ముప్పుగా పరిణమిస్తోంది. మొదట్లో వ్యాక్సిన్ ఒకటే డోసన్నారు.. తర్వాత అదికాస్తా రెండుగా మారింది. కొన్నాళ్లకు దానికి బూస్టర్ డోస్ కూడా పడాలన్నారు. ఎక్కువ వేరియంట్లు వస్తున్న ఈ తరుణంలో బూస్టర్ కావాల్సిందేనంటున్నారు. దానికి అనుగుణంగా ఔషధ సంస్థలు, ప్రభుత్వాలు బూస్టర్ డోసులపై దృష్టి పెడుతున్నాయి.

అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాత్రం ఆ అవసరం ఇప్పుడే లేదని అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అవసరమో కాదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. బూస్టర్ డోసును సిఫార్సు చేసేందుకు దానికి తగ్గ సరైన సమాచారం తమ వద్ద లేదన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా గురించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాయని, మరికొన్నాళ్లు ఆగాలని అన్నారు.

బూస్టర్ డోసు కూడా ఇవ్వాలని ప్రకటిస్తే.. కనీసం ఒక్క డోసు కూడా అందని పేద దేశాలు మరింత కాలం పాటు వ్యాక్సిన్ కోసం ఆగాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బూస్టర్ డోసుపై నిర్ణయం తొందరపాటే అవుతుందన్నారు. కొన్ని దేశాలు ఈ ఏడాది చివరి నాటికి ముందుజాగ్రత్తగా బూస్టర్ డోసు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయని, ప్రత్యేకించి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీకాలిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై డబ్ల్యూహెచ్ వో గైడెన్స్ టీమ్ కు సమాచారమిస్తామని ఆమె తెలిపారు.
Go Back to Shorts
COVID19
WHO
Soumya Swaminathan
Vaccine

More Telugu News