Kala Venkata Rao: దీనిపై సీఎం జ‌గ‌న్ ఎందుకు నోరు మెదపడం లేదు?: క‌ళా వెంక‌ట్రావు

  • సోలార్ టెండర్ల రద్దుతో ప‌రువు పోయింది
  • టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల వ‌ల్లే హైకోర్టు ర‌ద్దు చేసింది
  • కమీషన్లకు ఆశ‌ప‌డ్డారు
  • వైసీపీ ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవు
kala venkat rao slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత క‌ళా వెంక‌ట్రావు మండిప‌డ్డారు. సోలార్ టెండర్ల రద్దుపై ఆయ‌న‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్ర‌శ్నించారు. టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల వ‌ల్లే హైకోర్టు ర‌ద్దు చేసింద‌ని ఆయ‌న అన్నారు. ఏపీ ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల‌ ప్రపంచ స్థాయిలో రాష్ట్రం ప‌రువే కాకుండా దేశ పరువు పోయింద‌ని అన్నారు.

ఆ టెండర్లను అదానీ, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి బినామీ నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డికి చెందిన ఎలక్ట్రికల్స్ సంస్థలకు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న చెప్పారు. గ‌తంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కాలపరిమితి 25 ఏళ్లు ఉంటే వైసీపీ నేతలు విమ‌ర్శ‌లు గుప్పించార‌ని, ఇప్పుడు మాత్రం కాలపరిమితిని 30 ఏళ్లకు ఎలా పెంచారని ఆయ‌న నిల‌దీశారు.

భార‌త్ మొత్తం కనిష్ఠంగా రూ.1.90కే యూనిట్ సోలార్ విద్యుత్ లభిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం 60 పైసలు అదనంగా పెంచి కమీషన్లకు ఆశ‌ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు. గ‌తంలో త‌మ ప్ర‌భుత్వం 24 గంటల విద్యుత్ అందించిందని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా ఉన్న‌ప్ప‌టికీ వైసీపీ ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేక విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. రైతుల‌ బోర్లకు మీటర్లు బిగించి ఇబ్బందుల పాలు చేస్తున్నార‌ని అన్నారు.
.

More Telugu News