Neelam Sahni: ఎస్ఈసీ నీలం సాహ్నికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

  • ఎస్ఈసీగా సాహ్ని కొనసాగడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలి
  • సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎన్నికలు నిర్వహించారు
  • రూ. 160 కోట్ల ప్రజా ధనాన్నిదుర్వినియోగం చేశారు
  • గుంటూరుకు చెందిన డాక్టర్ శైలజ పిల్
PIL Against AP SEC Neelam Sahni In AP High Court

ఏపీ ఎన్నికల అధికారి నీలం సాహ్నికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ ఈ పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారని, ఫలితంగా రూ. 160 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆమె వృథా చేశారని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. నీలం సాహ్ని ఎస్ఈసీగా కొనసాగడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. వృథా అయిన ప్రజాధనాన్ని ఆమె నుంచి రాబట్టేందుకు వీలుగా రూ. 160 కోట్లకు బ్యాంకు పూచీకత్తు సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీ రంగులు తొలగించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎస్‌గా ఉన్నప్పుడు కోర్టుకు హామీ ఇచ్చిన నీలం సాహ్ని అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అలాగే, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీం ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సాహ్ని ఎస్ఈసీగా కొనసాగడాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని శైలజ తన పిల్‌లో అభ్యర్థించారు. ఈ పిల్‌లో ఎన్నికల సంఘం కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో నీలం సాహ్నిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి,జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం రేపు (సోమవారం) ఈ పిల్‌ను విచారించనుంది.

More Telugu News