Police: ఘ‌ట్‌కేస‌ర్‌లో రోడ్డు ప‌క్క‌న బాలిక మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు!

  • నిన్న అర్థరాత్రి తల్లితో స్ర‌వంతి గొడవ
  • ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వైనం
  • అనంత‌రం ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని నిర్ధార‌ణ‌
girl commits suicide says police

ఘ‌ట్‌కేస‌ర్‌లో ఓఆర్‌ఆర్‌ సమీపంలోని సర్వీస్‌ రోడ్డు పక్కన ఈ రోజు ఉద‌యం స్ర‌వంతి (17) అనే బాలిక మృత‌దేహం ల‌భ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. నిన్న అర్థరాత్రి తల్లితో స్ర‌వంతి గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు బాలిక తండ్రి తెలిపాడు. క్లూస్‌ టీంతో క‌లిసి పోలీసులు ఆధారాలు సేకరించి ఈ కేసును ఛేదించారు.

బాలిక తండ్రి చెప్పింది నిజ‌మేన‌ని తేలింది. తరచూ ఆ బాలిక‌ సెల్‌ఫోన్ వినియోగిస్తుండ‌డంతో ఆమె త‌ల్లి పలుసార్లు మందలించిందని పోలీసులు చెప్పారు. ఇదే విష‌యంపై నిన్న‌ రాత్రి కూడా స్రవంతిని తల్లి మంద‌లించ‌డంతో మనస్తాపం చెందిన ఆ బాలిక‌ అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. దీంతో ఆందోళన చెందిన త‌ల్లి ..  స్రవంతి కోసం గాలించినా క‌న‌ప‌డ‌లేదని చెప్పారు.

ఈ రోజు ఉదయం ఘట్‌కేసర్‌ సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు త‌మ‌కు సమాచారం అందించారని వివ‌రించారు. ఘటనా స్థ‌లిలో మొబైల్‌ ఫోన్ ల‌భించింద‌ని, ఆమె పేరు స్రవంతిగా గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామ‌న్నారు. స్రవంతి ఆత్మహత్య చేసుకున్నట్లు తాము నిర్ధారణకు వచ్చిన‌ట్లు తెలిపారు.

More Telugu News