BJP: అప్పుడు మమ్మల్ని బీజేపీ బానిసల్లా చూసింది: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

  • బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ ఎంపీ
  • శివసేనను అంతం చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపణ
  • ఉద్ధవ్‌ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా
BJP Treated Shiv sena as its Slaves

మహారాష్ట్రలో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో శివసేనను కమలం పార్టీ బానిసల్లా చూసిందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. శివసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఓ దశలో ఏకంగా తమ పార్టీని పూర్తిగా అంతం చేసేందుకు కుట్ర పన్నిందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేనపై బీజేపీ చిన్నచూపు కారణంగానే మహారాష్ట్రలో కొత్త కూటమి పురుడుపోసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రౌత్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అధికారం శివసేన చేతిలో ఉందన్నారు. మరోవైపు ఆదివారం జరిగిన మరో సభలో మాట్లాడుతూ.. ఉద్ధవ్‌ థాకరే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. కూటమి భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌లోని కీలక నేత తనకు సీఎం కావాలన్న ఆకాంక్ష ఉందని బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రౌత్‌ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

2014-19 మధ్య బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బీజేపీకి అధిక మెజారిటీ ఉండడంతో సీఎం పదవి ఆ పార్టీకే దక్కింది. కానీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటుపై విభేదాలు తలెత్తి ఇరు పార్టీలు దూరమయ్యాయి. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్‌ ఆఘాడీ కూటమి ఏర్పాటు చేసిన శివసేన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

More Telugu News